పుట:భాస్కరరామాయణము.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ఇది యొకబ్రహ్మకల్ప మిటు లెన్నఁడొకో పదునాలుగేఁడులుం
దుది గను నెల్లసేమములతోఁ గొడు కెప్డొకొ వచ్చు నంచు నీ
కెదురులు సూచుచున్ దినము లెన్నుచు నాసల నున్నతల్లికిన్
హృదయకుకూలవహ్ని యగు నీదెసశోకము దీఱదే కదే.

585


సీ.

నాఁడు లాక్షణికులు న న్నుపలక్షించి, యంఘ్రితలముల రేఖాంబుజంబు
లుజ్జ్వలకాంతి ని ట్లుల్లసిల్లుచు నున్కి, బట్టాభిషేకంబు భర్తతోడఁ
చెలువుగా నీయింతి సేయించుకోను నిఖి, లాంగకంబులు లక్షణాంచితములు
గావున సౌభాగ్యకలితయు నైదువ, యుం బుత్రిణియు నయి యొప్పు ననిరి
మద్గురులు వసిష్ఠాదులు మహితకీర్తి, యుతు లరుంధతి మొద లైనసతులు నాకు
నిచ్చుదీవనలును నట యెల్లవారి, వాక్యములుఁ దప్పెఁ జూచితే వసుమతీశ.

586


వ.

అనుచు విలపింపందగువాక్యంబుల శోకంబు వారింపఁ దలంచి త్రిజట యద్దేవి
నవలోకించి.

587


చ.

చెలువ కనుంగొనంగ శవచిహ్నము లేమియు లేవు ప్రాణము
ల్దొలఁగిన నంగకాంతు లిటు దోఁప వనాయక మైనసైన్యము
ల్నిలువవు వారె సూరెల బలీముఖవీరులు గంటె కంటె దా
పలిదెసఁ గంటఁ జంటను శుభస్ఫురణం బదె నీకు నొప్పెడున్.

588


క.

అంతియ కా దీపుష్పక, మింతీ విధవ లగువార లెక్కినఁ జన దొ
క్కింతయుఁ గావున నెమ్మెయి, సంతోషమ నీకు నా కసత్యము లేలా.

589


క.

తేఱుదురు రిపుల నిప్పుడ, మీఱుదురును గడిఁది మూర్ఛమెయి ని ట్లున్నా
రాఱనితేజంబులతో, నీఱు పయిం గవిసి యున్ననిప్పులుఁబోలెన్.

590


వ.

అనుచుఁ దగువాక్యంబుల శోకంబు వారించి మరలి యశోకారామంబునకుం
దోకొని చనియె నంత నిక్కడ రఘువీరుండు.

591


క.

సోలినచిత్తము దనలో, మేలుకనం దోన తెలివి మెయికొనున ట్లు
న్మీలితనయనసరోరుహుఁ, డై లక్ష్మణుఁ జూచి దుఃఖితాత్ముం డగుచున్.

592


సీ.

అకట యీయుత్తముఁ డనుదినంబును నాకుఁ, బరిచర్య లొనరింపఁ బరమభక్తి
వనభూములకు జటావల్కలంబులు పూని, యేతెంచి యం దెన్నక నెక్కుడైన
దుఃఖంబులకు నోర్చి తుది వచ్చి రిపులచే, బాహుబల మ్మస్త్రబలము నెడలి
విశిఖక్షతంబుల వెడలు పెన్నెత్తుటఁ, దొప్పఁదోఁగినమేను ధూళి బ్రుంగి
తూలి విన్నఁబాఱి యీలంకపఱగడ, నున్నవాఁడు సూచుచున్నవాఁడ
నేను నిట్టిదైన్య మింక న న్నేమందు, నాలికొఱకు ననుజుఁ గోలుపడితి.

593


క.

ప్రాణసఖుఁ డైనలక్ష్మణు, ప్రాణంబులు లేమి సీత పని యేటికి నా
ప్రాణము లేటికి నేటికి, బాణాసనదివ్యబాణభారము నాకున్.

594


చ.

అకట విరోధిసన్నిధిఁ బ్రియానుజు నిట్టులు డించి యే నయో