పుట:భాస్కరరామాయణము.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్గుణనిర్ఘోషజడీకృతశ్రవణమున్ రోదోంతరాకీర్ణమా
ర్గణవర్షంబుఁ బత్ప్లవంగబలముం గా నేచి యారామల
క్ష్మణులం జంపితి నాగపాశములఁ జిక్కం గట్టి లంకేశ్వరా.

568


క.

అనవుడు సంతోషంబున, విని నందను గారవించి వీడ్కొల్పుటయుం
దనమందిరమునకు జయ, ధ్వను లులియఁగ నేఁగె సమ్మదంబున నతఁడున్.

569


శా.

అంతం బంక్తిముఖుండు నున్మదమనోజావస్థచేఁ దూలుచుం
జింతింపం దొడఁగెన్ మహీసుత పతిస్నేహార్తయై చచ్చునో
కాంతాచేష్టిత మింద్రజాలము ననుం గైకొన్నొ భోగేచ్ఛమై
నంతర్వృత్త మెఱుంగరా దనుచు నూహాపోహలోలాత్ముఁ డై.

570


వ.

ఇట్లు చింతించి.

571


సీ.

త్రిజట రప్పించి యత్తెఱవతో నిట్లను, నీల్గిరి రాఘవు లింద్రజిత్తు
చేత నేఁ డీవార్త చెప్పి తోడ్కొనిపోయి, వసుమతీతనయకు వారిఁ జూపి
చిరకాలపరిచితస్నేహంబు మోహంబు, సేసెనేనియుఁ దేర్చి చెలిమిఁ గలసి
నిక్కంబులై తోఁచు నెయ్యంపుఁజెయ్వులు, నుపచారములుఁ బతు లున్నయపుడ
కాని వెనుకఁ జేత కాంతారచంద్రిక, భోగములకె కాదె పుట్టినారు
నెలఁత లట్లు గాన నీ వింక నీలంక, యేలు రాక్షసేంద్రు నేలు మనుము.

572


వ.

అని పలుక నన్నిశాచరియు నశోకవనంబునకుం జని వైదేహి కత్తెఱం గెఱిం
గించిన.

573


క.

[1]దిగులుపడి బిట్టు డెందము, పగులం బడి మూర్ఛ నొంది ప్రాణము లొడలం
దెగినట్లు నేలఁ బడి య, మ్మగువయు నొకవడికి మూర్ఛ మగుడం దెలిసెన్.

574


ఆ.

ఉప్పరంబు గదిరి డెందము శోకాగ్ని, సుట్టుముట్టి తాల్మి సుడివడంగ
నశ్రువారి వెలి వెలార్చుచందమున నం, దంద యడలుచున్నయతివఁ జూచి.

575


శా.

విద్యుజ్ఙిహ్వుఁడు మాయ పన్ని తలయున్ విల్లుం గదా చూపె నీ
యుద్యోగంబును నట్ల కా వలయుఁ గాక కొం డేల యౌ రాముఁ డా
పద్యుక్తుం డగునా విషాద ముచితం బా చూతుగా కాధను
ర్విద్యాపారగు సాయకాగ్నికణవద్విక్రాంతిపాథోనిధిన్.

576


వ.

అని మఱియు ననేకవిధంబుల బోధించి దేవీ నీవు రామలక్ష్మణులం బ్రచ్ఛన్నప్ర
కారంబునఁ దదీయక్షేమం బరసివత్తుగాక పోదము రమ్మనుచుం బుష్పకం బెక్కిం
చుకొని యెగసి మనోజవంబునం జని విగతమాయాజలధరజలాదికంబును దార
కాగణప్రభాభాసితంబును జంద్రరేఖాతిలకితప్రథమదిశాముఖంబును నటత్క
బంధబంధురంబును నగునభోభాగంబున నిలిచి కపిసైన్యంబునడుమ సుగ్రీవాం
గదజాంబవదాంజనేయవిభీషణప్రముఖపరివేష్టితులును విశిఖవికీర్ణవీతకవచులు

  1. దిగు లనుచు బెట్టు