పుట:భాస్కరరామాయణము.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వర్ణులు సప్తకోటిశతనహస్రశైలచరవీరులును హిమగిరిసమాశ్రితులు సహస్రో
త్తరసహస్రకోటిహరివీరులు వింధ్యాచలవాసులు నంగారనికరాభులు భీమవిక్ర
ములు భీమాకారులు నగుసహస్రకోట్లు మర్కటోత్తములుఁ గిష్కింధకు వచ్చిరి
మఱియు క్షీరోదధివేలానిలయులు నారికేళాశనులును జండాకారులు నైనబలీ
ముఖు లసంఖ్యానీకంబులఁ గూడి మార్తాండమండలంబు నిరోధించుచు నేతెం
చిరి వెండియు.

512


ఉ.

దిక్కులు నాకసంబు జగతీతలభాగము నెల్లచోటులుం
క్రిక్కిఱియంగఁ గ్రందుకొని కీశబలంబులు వెన్క ముందటం
బెక్కుపథంబులన్ నడువ భీకరభంగులఁ గ్రొవ్వు లారఁగా
నక్కజ మంద వచ్చి ప్లవగాధిపుఁబట్టణ మెల్ల ముంచినన్.

513


వ.

కని మనంబున నుత్సహించి మరుత్పుత్రుతో సుగ్రీవుం డిట్లనియె.

514


శా.

నే నీసేనలతోడఁ గూడఁగఁ బ్రియాన్వీతుండ నై తన్ను వే
కానం బోయిన నాదుయత్న మతికాంక్షం జూచి నామీఁద నా
భూనాథాగ్రణి కింక దక్కి కరుణాపూర్ణాత్ముఁ డౌఁ గా కెడం
దా నె గ్గొండు దలంచినం దలఁపనీ త న్గొల్వ నేఁ బోయెదన్.

515


వ.

అనిన విని హనుమంతుఁ డతని కి ట్లనియె.

516


ఉ.

రాముఁడు నిత్యసత్యుఁడు శరణ్యుఁడు న్యాయపరుండుఁ ద్రాతయున్
స్వామియు ధర్మవత్సలుఁడు సత్యసమేతుఁడుఁ గావ పాపహిం
సామతి గాఁడు లక్ష్మణుఁడు చాల సహాయుఁడు గాఁగఁ జన్న ని
న్నే మియుఁ జేయఁ డర్కసుత యేఁగుము వేగమ రాముపాలికిన్.

517


వ.

నావుడు సంతోషించి మిత్రపుత్రుండు మైత్రి నెరయ సౌమిత్రి కి ట్లనియె.

518


క.

శూరత వాలిన వాలి, న్దారుణగతిఁ దునిమి యిచ్చె నాకున్ రాముం
డీరాజ్యము నీనగరము, నీరుమ నీ తార నీసమృద్ధశ్రీలన్.

519


ఉ.

వచ్చి రుదగ్రవేగబలవంతులు నాప్తులు నైనసర్వభూ
భృచ్చరవీరవానరులు పెంపును సొంపును నొప్పఁగాఁ బ్లవం
గోచ్చయముల్ కెలంకులను గొల్వ సముద్ధతి రామభూవిభుం
డెచ్చట నున్నవాఁ డచటి కేఁగుద మవ్విభుఁ డుత్సహింపఁగన్.

520

సుగ్రీవుఁడు లక్ష్మణసహితుం డై మాల్యవంతంబునకు వచ్చుట

వ.

అని పలికి గమనోత్సాహం బెసంగ.

521


స్రగ్ధర.

భూరిప్రస్థానభేరు ల్పొరిఁబొరి జయము ల్పొంగ వేయించె నుద్య
త్పారావారోగ్రయాదఃప్రకరభయకరస్ఫారఘోరస్ఫురద్భాం
కారారావంబు లారన్ గగన మద్రువ దిగ్భాగము ల్వ్రయ్యఁ గిష్కిం
ధారుంద్రక్షోణిభృత్కందరములు పగులన్ ధాత్రి యాకంప మొందన్.

522