పుట:భాస్కరరామాయణము.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నీవు సహాయముగా సు, గ్రీవ దశగ్రీవుఁ దునిమి కీర్తి వెలుంగన్
భూవిభుఁడు సీతఁ దోడ్కొని, వావిరి సాకేతపురి కవశ్యం బరుగున్.

503


చ.

ధరణిజఁ బాసి నెవ్వగలఁ దద్దయు వేఁగుచు నున్న రామభూ
వరుకడ కేఁగుదెంచి ప్రియవాక్యములన్ ముద మందఁజేయు వా
నరవర దుఃఖి యైననరనాథునిపంపున నల్లి నిన్ను ని
ష్ఠురములు పెక్కు లాడితిఁ గడున్ మది సైఁపుము నన్ను మైత్రితోన్.

504


క.

అని లక్ష్మణుండు పలికిన, మనమున సంతోష మంది మర్కటనాథుం
డెనయఁగఁ దనపార్శ్వంబునఁ, దనరెడుహనుమంతుఁ జూచి తగ ని ట్లనియెన్.

505


శా.

నీలాస్తోదయసహ్యభూధరముల న్వింధ్యాంజనాగంబులం
గైలాసంబున హేమకూటనిషధగ్రావప్రదేశంబులం
బ్రాలేయాచలమేరుమందరమహేంద్రక్షోణిభృల్లోకలో
కాలోకాద్రుల మాల్యవన్మలయముఖ్యతిక్ష్మాధరేంద్రంబులన్.

506


చ.

ధరఁ గలసర్వపర్వతకదంబనివాసులఁ బూర్వపశ్చిమో
త్తరజలరాశితీరసముదగ్రసరిద్వనభూములం గరం
బిరువుగ నున్న వానరుల నే మును దేరఁగఁ బంచినాఁడ బం
ధురగతి నీవు సత్త్వజవధుర్యగతిజ్ఞులు నైనవారలన్.

507


వ.

శతసహస్రకోటిసంఖ్యలు గలవానరవీరులం బుచ్చి సకలదిక్కులకపుల సామ
దానాదుల మన్నించి వేవేగ యిటకు రప్పింపు మని నియోగింప నాంజనేయుం
డును నట్ల పనుపఁ దదీయనియుక్తులయిన వీర మర్కటకో ట్లాటోపంబున.

508


చ.

ఉరవడి నింగికిన్ నెగసి యుద్ధురవేగము లార నేఁగి తా
రురుగిరులం బయోధుల వనోపవనంబుల సింధుభూములం
బరఁగఁగ నున్న వానరుల భానుజునానతిఁ జెప్పి మీరు స
త్వరగతి వానరేంద్రుఁ గొలుకవం జనుఁ డంచును జీరి యేపునన్.

509


క.

తరణిజుదూతలు వనచర, వరులు మధురకందమూలవాంఛితఫలముల్
వరుసం గొని కిష్కింధా, పురమునకున్ వచ్చి రెలమి భూరిత్వరు లై.

510


ఉ.

వచ్చి సమస్తవానరులు వన్యఫలంబులు కందమూలముల్
తెచ్చి యుపాయనోచితగతిం దగ నిచ్చి కపీంద్ర మమ్ము మున్
పుచ్చిన సర్వదిక్కులకుఁ బోయి వనాటుల నోలిఁ జీరి వే
వచ్చితి మెల్లవానరులు వచ్చెద రిప్పుడ యంచుఁ జెప్పినన్.

511


వ.

సుగ్రీవుండు సంతసంబు నొంది తనమనోరథంబు సఫలంబు నొందె రామ
చంద్రునికోర్కి దీర్పం గలిగె నని తలపోసి వచ్చినవారల వీడ్కొలిపి నంతఁ
గపిరాజుశాసనంబును నస్తాచలవాసులు దప్తహేమప్రభగలవారలు మనోవేగులు
మూఁడుకోట్లప్లవంగయూథవులుఁ గైలాసశిఖరంబున నున్న సింహకేసరభాసుర