పుట:భాస్కరరామాయణము.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డ్కొని తేర బలిమి గలవానరులం బంచినవాఁడు గావునఁ గోపం బుడిగి ప్రస
న్నుండవు గ మ్మనుచుఁ బలికి.

491


ఉ.

దేవనుతుండు రామజగతీపతి వానరసేనఁ గొంచు సు
గ్రీవుఁడు తోడుగాఁ జని గరిష్ఠవిశిష్టబలాఢ్యుఁ డై దశ
గ్రీవు వధించి సీతఁ గొని ప్రేమ మెలర్పఁగ వచ్చు నంచు సం
భావన నాకు వాలి మును ప్రాజ్ఞత యొప్పఁగఁ జెప్పెఁ గావునన్.

492


క.

రావణునిఁ దునిమి రామ, క్ష్మావిభుఁడు మహీజతోడ జయలక్ష్మీసం
భావితకీర్తులు వెలయఁగ, వేవేగ మయోధ్య నేల వేంచేయుఁ దగన్.

493


చ.

అని నయ మారఁ దార తగ నాడెడుమాటల కిచ్చగించుచున్
ఘనుఁ డగులక్ష్మణుండు వినఁగా నపు డవ్విభ వెంట నాత్మ నే
చినభయ మెల్ల బోవ విడిచెం గమలాప్తసుతుండు ద్రెంచి వా
డినగజపుష్పదామము తొడింబడఁ బాఱఁగ వైచుకైవడిన్.

494


వ.

అట్లు లక్ష్మణునివలనిభయంబుఁ బాసి సుగ్రీవుండు ప్రస్తుతవాక్యంబుల హృద
యం బలర ని ట్లనియె.

495


చ.

జగతీనాయకునాజ్ఞ నే మఱతునే సైన్యంబులం గూర్చి తేఁ
దగువారిన్ మును సర్వదిక్కులకు నాస్థం బంచి నేఁ డెల్లి క్షి
ప్రగతిన్ వచ్చెద రంచు వానరచమూపాంసుచ్ఛటాసమ్మిళ
ద్గగనాభోగనిరీక్షణోన్ముఖుఁడ నై గాసిల్లెదం గాంక్షతోన్.

496


మ.

నను ముబ్బాములఁ బెట్టువాలి ననిలోలన్ లీలఁ దున్మాడి నా
కనుమోదంబుగ సర్వసంపదలఁ బ్రాజ్యం బైనరాజ్యంబు ని
చ్చె నృపాలాగ్రణి తత్ప్రసాదమున నీశ్రీ లొంది యున్నాఁడఁ బెం
పెనయన్ నామది నామహాత్మునిఋణం బే నేమిట న్నీఁగెదన్.

497


క.

అరుదుగ నేకాస్త్రమునన, ధరణీశుఁడు లీల నేడుతాళంబులు భూ
ధరమును భూతలమును దా, నురవడిఁ గాఁడి చన నేసె నుద్ధురభంగిన్.

498


చ.

ధరణి సమస్తమున్ వడఁకెఁ దద్ధను వప్పుడు మ్రోయ రాముఁ డొ
క్కరుఁడ భుజోగ్రశక్తిఁ ద్రిజగంబులు గెల్వఁగ నోపు నాసము
ద్ధురభుజశాలి కెవ్వరును దోడ్పడ నేటికి నైన సేనతో
నరిగెద లంకమీఁదికి నృపాగ్రణి కే ననుయాయిమాత్ర మై.

499


క.

జననాథుఁడు మన్నించుటఁ, జనవు మెఱసి యైన నధికసఖ్యంబున నై
నను నేఁ దడసితి దాసుఁడ, ననుఁ జేకొను మనపరాధి నరనాథసుతా.

500


వ.

అనిన ముద మంది సౌమిత్రి మైత్రి నెరయ నమ్మిత్రసూనం గనుంగొని.

501


క.

దైవము నీకును రామ, క్ష్మావిభునకు నిట్లు మైత్రి గలుగఁగఁ జేసెన్
నీవును నృపతియుఁ గులమున, లావున దొరయఁ దగువారు ప్లవగాధీశా.

502