“నా ఆత్మేశ్వరా!”
“నా ఆత్మమూర్తి! నా యీ కౌగిలింతకు రా! ఈ దివ్యప్రేమలో నే ప్రాణము వీడుటకల్ల. నీ ప్రేమబలమే నన్ను రక్షించును. నా పూజయే నిన్ను, నాపూజాపీఠమున నున్న దేవిని నా హృదముమున చేర్చును!”
“వలదు దేవా! వలదు. అపాయము.”
“అపాయమైన నేమి, ప్రాణముపోయిన నేమి? ఈ దివ్యానందానుభూతి కోరి మాద్రీ దేవిని చేరిన పాండురాజు గాథ నెఱుగవా?”
“వద్దు ప్రభూ! వద్దు, మీరటులనే యుండుడు. నాపూజామూర్తికి, నా శివునకు, నా భగవంతునకు కళంకము రానీకుడు!”
శ్రీకృష్ణసాతవాహనుడు గడగడ వడంకి, కన్నులు మూసికొని, యా మందిరము వెడలి అంగలువేసికొనుచు నడచిపోయెను. విషబాల నిల్వున కూలిపోయెను.
28. పునస్సమాగమము
పాటలీపుత్రముకడ పోరు మిన్నంటిపోవుచుండెను. ఒక దినము జరిగినకొలది ఆంధ్రుల ప్రతాపము ఉధృతము మీదుమిక్కిలి యగుచున్నది.
రాత్రిందినములు అరువది గడియలు ఎడతెగని ఆ ముట్టడిచే అభేద్యమగు పాటలీపుత్రనగరము ఇంద్రుని వజ్రఘాతముచే కొండలరెక్కల ముక్కలగుచున్నట్లు ఒక కోటవెనుక వేరొక కోట, మహానగరము చుట్టు నున్న ఏడుకోటలు వశమయ్యెను.
ఈ రెండు నెలలలో ఆంధ్ర సైన్యములు చెక్కుచెదరక, అలసట నొందక పోరాడుచున్నవి. సుశర్మకాణ్వాయనుడు మొక్కవోని ధైర్యముచే పోరాడుచుండెను. ఉజ్జయినికడ ఓడిపోయిన మాళవ సైన్యములలో పదివేలమంది కరకుమానిసులు అమావాస్య చీకటి రాత్రులలో పాటలీపుత్ర నగరములోనికి గంగపై పడవలలో వచ్చి చేరిరి.
వారు సుశర్మచక్రవర్తికి ఎంతయో ధైర్యము కొనివచ్చిరి. మాళవులలో పారిపోయి వచ్చిన తక్కిన సైన్యములు ఆంధ్రులను వెనుకనుండి చీకాకుపరచుచు, నాశనముచేయుచు, పాటలీపుత్రముపై ఒత్తిడి తగ్గించెదమని మాట నిచ్చిరి.
ఆ మాళవుల సైన్యములు మహావేగముతో వచ్చుట, ఆంధ్రుల నొకమూలతాకుట, మరల నంత వేగముతోడనే వెడలిపోయి మాయ మగుట - ఇట్టి యుద్ధవిధాన మవలంబించెను. ఆ యుద్ధవిధానమువలన ఆంధ్రులు చికాకు నందిరి. దాదాపు ఒక వేయిమంది ఆంధ్ర సైనికులు, అశ్వికులు నాశనమైరి.
అటుల రెండుసారులు జరుగునప్పటికీ స్వైత్రులవారు - కాండీర, శాక్తిక, యాష్టీక, సైస్త్రింశిక కాంతికాది అశ్వికముఖములను నూరింటిని జంఘాకఠికముఖములుగా నేర్పాటుచేసి, మాళవాభిముఖముగా నంపి, వారి ఉనికి తెలిసి వారిని తలపడుటకును, వార్తాహరులచే తనకు వార్తలంపుటకును ఏర్పాటు చేసెను.
ఇంతలో ఉజ్జయినినుండి శ్రీకృష్ణసాతవాహనుడు, మంజుశ్రీసాతవాహనుడు, సోమదత్తాచార్యులు, సమవర్తి, సువర్ణశ్రీ, హిమబిందు, ముక్తావళీ దేవి, విషబాల, మహాబలగోండుడు మొదలగువారు సైన్యములతో పాటలీపుత్రము వచ్చి చేరిరి.
అడివి బాపిరాజు రచనలు - 2
• 231 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)