పుట:భాస్కరరామాయణము.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దొరయ జంగమాద్రులభంగిఁ ద్రోచి రాత్రి
చరులు మ్రింగఁ జొచ్చిరి వనచరుల నపుడు.

537


శా.

ఖద్యోతంబులభంగిఁ బుంఖమణు లాకాశంబునం దోఁపఁగా
విద్యుద్వేగమహాశిలీముఖముఖావిర్భూతదీప్తుల్ భయా
పాద్యుల్కా గతిఁ జూపఁ జూపె ధరణీపాలుండు నాలో ధను
ర్విద్యానై పుణిఁ జిచ్చుటంపఱఁ దమోవిధ్వంసముం జేయుచున్.

538


సీ.

మురిసినమణిమయముకుటపంక్తులు ప్రభా, లీఢదిగ్దీపమాలికలు గాఁగఁ
గూలినదళితేభతకుంభమౌక్తికతతు, లిచ్చినపువ్వుదోయిళ్లు గాఁగఁ
బడి ప్రోవు లై యున్నబహుగాత్రఖండముల్, రచితమహోపహారములు గాఁగఁ
గలయంగ మడువులు గట్టిన గజఘోట, కాదిరక్తములు మద్యములు గాఁగ
నట్లు పూజ నొందియుఁ దనియక మహాసి, దంష్ట్రయును నటద్భూతబేతాళయుతయు
నగుచు నంతకంతకు నేచె నతులగతులఁ, గాళరాత్రియుఁబోలె నక్క డిఁదిరాత్రి.

539


వ.

అంత నంతకుమున్న కయ్యంబున వంచించి చని లంక సొచ్చి యింద్రజితుం
డంతర్గతంబున.

540


శా.

దంభోళిద్యుతి దుర్నిరీక్ష్యుఁ డగుచున్ దర్పంబునం బేర్చునా
జంభారిం జెఱగొన్నయేఁ గలుగఁగా శాఖామృగశ్రేణిచే
నంభోరాశికి లంకకుం గలిగె దైన్యం బింక మద్భాహుసం
రంభం బేటికిఁ జెల్లుఁ గాక రఘువీరఖ్యాతి లోకంబునన్.

541


వ.

అనుచు జయోపాయంబుఁ జింతించి దారుణంబైనయొక్కమారణకర్మం బాచరిం
చువాఁడై రక్తమాల్యాంబరోష్ణీషాదులు ధరియించి హోమశాలకుం జని
హితప్రకారంబున దానవగురూపదిష్టం బగునాధర్వణతంత్రం బనుష్ఠింపఁ గుండ
మధ్యంబునం బ్రదక్షిణార్చులఁ బేర్చు ననలంబున దివ్యభూషణభూషితం బయి
యవధ్యం బగునశ్వచతుష్టయంబుతోడ వివిధాయుధభరితం బగునొక్కపసిండి
రథం బెగసినం గైకొని సమరసన్నాహంబున మెఱసి రథారోహణంబు సేసి
రాక్షసులం గనుంగొని.

542

ఇంద్రజిత్తు మాయాయుద్ధం బొనర్చుట

చ.

రణమున నుగ్రసాయకపరంపర భానుకులం బరామల
క్ష్మణము జగం బవానరము గా విలునేర్పును మద్భుజావిజృం
భణమును జూపి తండ్రిమదిఁ బట్టినచింతఁ దొలంగఁబెట్టి శూ
ర్పణఖకు నట్లు పాటిలినబన్నము నీఁగుదు నేఁ డవశ్యమున్.

543


క.

అనుచు నలక్షితరథుఁ డై, ఘనమార్గంబునకు నెగసి కార్ముకధరుఁ డై