పుట:భాస్కరరామాయణము.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సుషేణుండును బహుదశసహస్రంబులతోడ హనుమంతునితండ్రి కేసరియును
మహా వేగులై నకోటిగోలాంగూలురతోడ గవాక్షుండును శతసహస్రకోటిఋక్ష
వీరులతోడ ధూమ్రుండును మహాబలసమాను లైనపదికోట్లబలీముఖులతోడఁ
బనసుండును బదికోట్లకపులతోడ నీలాంబుదనిభుండును యూథపయూథపుండు
నగునలుండును బండ్రెండుకోట్లతోడ సనాథుండు నొక్కొక్కకోటితోడ గజగవ
యవృషభశరభులు నేడెనిమిదికోట్లతోడ మైందద్వివిదులు నాఱుకోట్లతోడ గం
ధమాదనుండును గోటిఋక్షవరులతోడ ఋమణ్వంతుండును సహస్రశతశంఖంబుల
తోడ నంగదుండును సహస్రకోట్లతోడఁ దారాధిపద్యుతి గలతారుండును బెక్కు
సేనలు గొలువ వేయికోట్లతోడ హనుమంతుండును బద్మకోటిశతంబులతోడ
నింద్రజాలుండును శతకోటిశతంబులతోడ నీలద్యుతి గలనీలుండును బండ్రెండు
కోట్లప్లవగవీరులతోడఁ బ్రజంఘుండును సహస్రఖర్వంబులతోడఁ గుముదుండును
నిరువదియొక్కకోటితోడ దధిముఖుండును బొడచూపిరి మఱియును వినతుండును
విజయుండును సంపాతియు జాంబవంతుండును వేగదర్శియు మహాహనుండును
శతార్చియు శతగుల్ముండును సుహోత్రుండు నుల్కాముఖుండును మొదలుగాఁ
గలకామరూపు లైనప్లవంగపుంగవులు తమతమసైన్యంబులతోడ శైలవనసా
గరసహిత యైన సర్వంసహ నావర్తించి గునియుచు నుప్పరం బెగసి దాఁటుచుం
ద్రుళ్లుచు గర్జిల్లుచు వచ్చి సుగ్రీవునిం బరివేష్టించిరి తత్సమయంబున సుగ్రీవుండు
రామచంద్రున కి ట్లనియె.

543


చ.

జనవర వచ్చి రిచ్చటికి సర్వదిగంతరకీశవీరులున్
జనకజఁ జూచి వచ్చెదరు చయ్యన నెచ్చట నున్ననైన
పనుపుము వీరి నావుడు నృపాలుఁడు సంతస మంది యి ట్లనున్
వనచరనాథ నాకుఁ గలవాఁడవు నీవ సమస్తభంగులన్.

544


క.

కావున జానకి వెడకం, బోవఁగ రాఁ గలప్లవంగపుంగవులఁ దగన్
నీవ యెఱుంగుదు వారల, వేవేగం బనుపు మహిజ వెదకఁ గపీంద్రా.

545

సుగ్రీవుఁడు వినతునిఁ దూర్పునకు సీతను వెదకం బుచ్చుట

వ.

అని పలుక సుగ్రీవుం డలరి శైలాకారుం డై భీమనిర్ఘోషంబు సేయుచున్న విన
తుం డనుయూధపుం బిలిచి సోమసూర్యాత్ములు దేశకాలజ్ఞులు గమనాగమన
ప్రవీణులు నైనశతసహస్రవానరులతోడం గూడఁ దూర్పునకు వైదేహి వెదక
నరుగుము తదీయమార్గంబు విను మనుచుం బలికి.

546


శా.

రేవాశోణనదోపకంఠముల నర్థిం జాల శోధించి శి
ప్రావాహిన్యభిరామభూమిఁ దమసాప్రాంతంబునన్ గోమతీ
కావేరీనదిపొంతఁ గౌశికికడం గాళిందితీరంబున
న్దేవద్వీపవతీసవిూపమున నన్వేషింపుఁ డుర్వీసుతన్.

547