Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/సింహాద్రి అప్పన్న సేవ

వికీసోర్స్ నుండి

సింహాద్రి అప్పన్న సేవ

విశాఖపట్టణానికి అతి సమీపంలో వున్న పుణ్యక్షేత్రం సింహాచలం. సింహాచలక్షేత్రంలో ప్రసిద్ధమైన వరాహ నరసింహస్వామి దేవాలయం వుంది. దీనినే సింహాద్రి అప్పన్నకొండ అంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి మొదలైన జిల్లాల ప్రజలకూ అటు ఒరిస్సా ప్రజలకూ ఆరాధ్య పుణ్యక్షేత్రం సింహాచలం.

దేవుడికి పూజ చేయటమే సేవ, సింహాచల క్షేత్రానికి మ్రొక్కు బడులు చెల్లించటానికి వచ్చే ప్రజలు ఆచరించేదే సింహాద్రి అప్పన్న సేవ.

వరాహ నరసింహ స్వామిని కీర్తిస్తూ కథకుడు నల్లని వెండి పొన్నుల కర్రను చేతిలో ధరించి మరో చేతిలో నెమలి ఈకల కుంచెను పట్టుకొని కథను చెపుతూ వుండగా తనకు వంతగా వున్న భక్తులందరూ పెద్ద పెద్ద తాళాలను చేతపడతారు. అందరూ జరీ అంచుగల తలపాగలను ధరిస్తారు. బృందంలోని మరి కొందరు నూనె గుడ్డలను చుట్టిన కోలలను వెలిగించి పట్టుకుంటారు. ఈ కోలల వెలుగులో పెద్ద తాళాలను మ్రోగిస్తూ బృందం వలయాకారంగా తిరుగుతారు. ప్రధాన కథకుడు చరణం పాడితే, వారి దానిని వంతగా అనుసరిస్తారు. ఇది బృంద గానం, హరిహరి నారాయణా ఆది నారాయణా అనే పల్లవిని ప్రారంభిస్తారు.